గ్రేటర్‌లో బడ్జెట్‌కు మిశ్రమ స్పందన

by  |
గ్రేటర్‌లో బడ్జెట్‌కు మిశ్రమ స్పందన
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ శాసనసభలో ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21పై గ్రేటర్ హైదరాబాద్‎లో రాజకీయ వర్గాల భిన్నవిధాలుగా స్పందించాయి. నగర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని మేయర్ బొంతు రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. నగరం అభివృద్ధికి రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పిన ఆర్థిక మంత్రి కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించారు.

ప్రభుత్వ శ్రద్ధ, చిత్తశుద్దికి నిదర్శనం: బొంతు రామ్మోహన్, నగర మేయర్

హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి రూ. 50 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. బడ్జెట్‎లో నగర అభివృద్ధి, మూసీ ప్రక్షాళన, కారిడార్ల నిర్మాణానికి రూ 10 వేల కోట్లు కేటాయించింది. నగరంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ద కు, చిత్త శుద్ధికి ఈ కేటాయింపులు నిదర్శనం. 2020-21 వార్షిక బడ్జెట్ లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ కు, కేటీఆర్, హరీశ్ రావుకు ధన్యవాదాలు.

ఎన్నికల కోసమే కేటాయింపులు: శ్రీనివాస్, సీపీఎం గ్రేటర్ నాయకులు

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే రూ.10వేల కోట్లను కేటాయించినట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో ఏ పనికి ఎంత ఖర్చు చేస్తారనేది ప్రభుత్వం ప్రకటించలేదు. గత ఆరేండ్లలో మూసీ నది ప్రక్షాళన కోసం మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడేదో అద్భుతాలు చేస్తామనం చెప్పడం హాస్యాస్పదం. రాష్ట్రంలో మూడో వంతు జనాభా ఉండే గ్రేటర్లో కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. కేటాయింపులను సవరించడంతో పాటు ఖర్చు వివరాలను స్పష్టంగా ప్రకటించాలి.

ప్రజలను మభ్యపెడుతున్నారు: పోటు రంగారావు, న్యూడెమక్రసీ

ఆర్థిక మాంద్యంతో రాష్ట్ర రాబడి 24 శాతం తగ్గిందని చెబుతూ, అప్పుల మీద అప్పులు చేస్తూ అంకెలు పెంచి సుమారు 1,83,000 కోట్లు బడ్జెట్ అనడం అతిశయోక్తి, ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించడమే. నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేటాయింపులు లేవు. కార్మికుల, అసంఘటిత రంగాల కార్మికుల కనీస వేతనం, ఉద్యోగ భద్రత పట్టించుకోలేదు. విద్యారంగానికి తగిన కేటాయింపులు లేవు.

tag: budget, different opinions, trs, Opposition party leaders



Next Story

Most Viewed