నాకు పరుగుల దాహం ఇంకా తీరలేదు : మిథాలీ

by  |
Mithali Raj
X

దిశ, స్పోర్ట్స్: మహిళ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్లలో కలిపి 10337 పరుగులు చేసిన మిథాలీ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (10273)ను దాటేసింది. 22 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తనకు ఇంకా పరుగుల దాహం తీరలేదని శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం వ్యాఖ్యానించింది. ‘నా క్రికెట్ కెరీర్ అంత సవ్యంగా ఏమీ సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొన్నాను. చాలా సార్లు ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించాను. కానీ నాకు క్రికెట్‌లో కొనసాగడమే ఇష్టం. ఏదో ఒక విషయం నన్ను ఈ కెరీర్ కొనసాగించేలా చేసింది. 22 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడుతున్న నాకు ఇంకా పరుగుల దాహం తీరలేదు. భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలి. నేను మరెన్నో పరుగులు చేయాలి. వాటిపైనే ప్రస్తుతం దృష్టిపెట్టాను’ అని మిథాలీ రాజ్ అన్నది. భారత జట్టు మూడో వన్డేలో గెలిచినా 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్‌ను ఎగరేసుకొని పోయింది.

Next Story