మిషన్ భగీరథ: కనెక్షన్లు సరే.. మరి నీళ్లు ఏవి?

by  |
మిషన్  భగీరథ: కనెక్షన్లు సరే.. మరి నీళ్లు ఏవి?
X

దిశ,రేగొండ: ఇంటింటికీ శుద్ధ జలాలను అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ఆవాసాలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. అయితే కొందరు అధికారుల తీరుతో పథకం అభాసుపాలవుతోంది. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే అతి పెద్ద మండలంగా పేరు గావించిన రేగొండ మండల కేంద్రంలో ఏండ్ల తరబడి నుంచి మిషన్ భగీరథ నీరు అందడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే నీళ్లను సరఫరా చేస్తున్నారు.ప్రతి ఇంటికి భగీరథ అధికారులు నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ భగీరథ నీళ్లను సరఫరా చేయడంలో అధికారులు విఫలం అయ్యారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నప్పటికి మండలకేంద్రంలో మంచినీటిని అందించకపోవడం గమనార్హం.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే నీరు..

రేగొండ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ప్రతి ఇంటికి ఇచ్చినప్పటికీ నీళ్లను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీళ్లకు సంబంధించిన బావి పూర్తిగా చెరువులో ఉండిపోవడంతో గ్రామస్తులకు మురికినీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు.

భగీరథ నీళ్లు రాకపోవడానికి సమస్య ఏంటి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కొన్ని గ్రామాల్లో సక్సెస్ గా కొనసాగుతున్నప్పటికీ, ముఖ్యమైన మండల కేంద్రాల్లో అమలు కాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మిషన్ భగీరథ ట్యాంకులు సరిగా లేకపోవడం, పైపులైన్ల ద్వారా నీరు సరిగ్గా రాకపోవడం, కొన్నిచోట్ల పైపులైన్లు పూర్తి కాకపోవడం వంటి సమస్యలతో దర్శనమిస్తోంది. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed