‘మిషన్ భగీరథ’ వృథా నీరు దాహాన్ని తీర్చలేవా..?

by  |
‘మిషన్ భగీరథ’ వృథా నీరు దాహాన్ని తీర్చలేవా..?
X

దిశ, ఎల్లారెడ్డి: రోజురోజుకూ ఎండతీవ్రత పెరగడంతో తాగు నీటి కోసం ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ప్రముఖ పట్టణాల్లోనే వేసవిలో నీటి ఎద్దడి సాధారణం. ఇక అటవీ, గ్రామ శివారు ప్రాంతాల్లో చుక్క నీరు కనబడదు. జంతువులు, పక్షులు తాగునీరు లేక అడవుల్లో అల్లాడిపోతున్నాయి. ఇటువంటి ఓ ఘటన కామారెడ్డి జిల్లాలో ‘దిశ’ కంటపడింది. సింగూర్ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో హజీపూర్ తాండ శివారులో మిషన్ భగీరథ వాల్ దగ్గర కొద్ది కొద్దిగా నీరు లీకు కావడంతో వానరులు గొంతు తడుపుకునేందుకు సర్కస్ చేస్తున్నాయి. వాల్‌కు నాలుగువైపుల ఐరన్ గ్రిల్స్ ఉండడంతో బొట్టు బొట్టుగా కారుతున్న నీటిని తాగేందుకు ఎంతో ఇబ్బందిపడ్డాయి. ఇక ఇదే విషయంపై పలువురు జంతు ప్రేమికులు స్పందిస్తూ.. జంతువులు, పక్షుల కోసం ప్రత్యేకంగా ఏదైనా నీటి సదుపాయం కల్పించాలని అధికారులను కోరుతున్నారు. వృథాగా పోతున్న నీటిని దప్పికతో అల్లాడుతున్న మూగ జీవాలకు ఉపయోగపడేలా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story