గణతంత్ర వేడుకల్లో మిషన్ భగీరథ నీరు

by  |
గణతంత్ర వేడుకల్లో మిషన్ భగీరథ నీరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మిషన్ భగీరథ’ నీరు వినియోగంలోకి రానుంది. లాంఛనంగా పబ్లిక్ గార్డెన్సులో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు బాటిళ్ళ ద్వారా దీన్ని సరఫరా చేయనున్నారు. ఇకపైన ప్రభుత్వపరంగా జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ‘మిషన్ భగీరథ’ నీటినే వినియోగించున్నారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఇప్పటికే అన్ని స్థాయిల్లోని అధికారులకు ఈ నీటిని వినియోగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో బాటిళ్ళ ద్వారా వాడే ‘మిషన్ భగీరథ’ నీటిని ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ సైతం అన్నింటికన్నా ‘మిషన్ భగీరథ’ నీరే శ్రేష్ఠమైనదని వ్యాఖ్యానించారు. దీంతో గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ నీరు అందుబాటులోకి రానుంది. ప్రతీ నెలా అనేక ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కార్యక్రమాల్లో ప్రైవేటు నీటి బాటిళ్ళను వినియోగించడానికి అవుతున్న ఖర్చు తగ్గిపోనున్నది.

నేడు గణతంత్ర దినోత్సవానికి సీఎం కేసీఆర్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేర్వేరు చోట్ల జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్సులో జరిగే కార్యక్రమానికి హాజరై అమరవీరుల స్థూపం దగ్గర పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి పరేడ్ గ్రౌండ్స్ సందర్శించి నేరుగా పబ్లిక్ గార్డెన్సుకు వస్తారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులతో ముచ్చటించి మిషన్ భగీరథ వాటర్ గురించి స్వయంగా ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకుంటారు.

సచివాలయానికి మూడు రంగులు

రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను సాధారణ పరిపాలన శాఖ అధికారులు జాతీయ పతాకంలోని మూడు రంగులను ప్రతిబింబించే విధంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. భవనం మొత్తాన్ని నాలుగు వైపుల నుంచి మూడు రంగుల విద్యుత్ దీపకాంతులను చూసి నగర ప్రజలు మురిసిపోయారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇదే తరహాలో అలంకరణలను చేశారు.


Next Story

Most Viewed