అదృశ్యమైన మహిళ.. అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది

by  |
అదృశ్యమైన మహిళ.. అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది
X

దిశ, లింగాల : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని వడ్డెరాయవరం గ్రామానికి చెందిన కాట్రాజు పెద్దమ్మ (40) అనే వివాహిత మహిళ ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో మృతురాలి అన్న నిమ్మల మల్లయ్య ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ సోమవారం అడవిలో ఒక చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిందని పోలీసులకు సమాచారం వచ్చింది.

స్థానిక ఎస్సై కృష్ణయ్య కథనం ప్రకారం.. రాయవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని శవం చెట్టుకు వేలాడుతుందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం అదృష్యమైన మహిళ కాట్రాజు పెద్దమ్మగా గుర్తించినట్టు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలిని ఎస్‌ఐతో పాటు అచ్చంపేట సీఐ అనుదీప్ కూడా పరిశీలించారు. బాధితురాలిని గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త చిన్న వెంకటయ్యను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, మృతురాలికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story