మిస్టరీగా ఆ ముగ్గురు మహిళల మిస్సింగ్

by  |
women Missing
X

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న యువతుల మిస్సింగ్ మిస్టరీగా మారుతోంది. ఇదే నెల మొదటి వారంలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం కాగా, తాజాగా ఒకేరోజు ముగ్గురు మహిళలు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. శుక్రవారం వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ముగ్గురు మ‌హిళ‌లు అదృశ్యం అయిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

బంధువుల ఇంటికి వెళ్లొస్తా..

చందాన‌గ‌ర్ వేముకుంట‌కు చెందిన ఎం.రాజు, శ్రీరామ్ సంతు(23)ల‌కు మూడు నెల‌ల క్రితం వివాహం అయ్యింది. రాజు స్థానికంగా డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా శ్రీరామ్ సంతు గృహిణి. గ‌త నెల 27న బయ‌ట‌కు వెళ్లిన భ‌ర్తకు ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో ‌శ్రీరామ్ సంతు ఫోన్ చేసి త‌న అక్కవాళ్ల ఇంటికి వెళుతున్నట్టు చెప్పింది. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కు భ‌ర్తతో ఫోన్‌లో ట‌చ్‌లో ఉంది. ఆ త‌ర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. దీంతో బంధువులు తెలిసిన వారివ‌ద్ద ఆరాతీసిన భార్య జాడ దొర‌క‌లేదు. దీంతో రాజు చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

ఇళ్లు విడిచి హాస్టల్‌కు వెళ్లి..

చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీ ఆరంభ్ టౌన్‌ షిప్‌ లో నివాసం ఉండే స‌తీష్‌, రాజహంస(33)ల‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. రాజు స్థానికంగా కాంట్రాక్టర్‌గా ప‌నిచేస్తుండ‌గా రాజ‌హంస గృహిణి. కాగా పెళ్లయిన నాటినుంచి వారిరువురి మ‌ధ్య అప్పుడ‌ప్పుడు చిన్నచిన్న తగాదాలు చోటుచేసుకునేవి. ఈ క్రమంలోనే జ‌న‌వ‌రి 29న బ‌య‌ట‌కు వెళ్లిన భ‌ర్త స‌తీష్‌ కు భార్య రాజ‌హంస ఫోన్ చేసి త‌న‌ను స‌రిగా చూసుకోవ‌డం లేద‌ని, అందుకే త‌ను ఇళ్లి విడిచి వెళ్లిపోతున్నట్టు తెలిపింది. జేఎన్‌టీయూ వ‌ద్ద హాస్టల్‌లో ఉంటున్నట్టు తెలిపిన భార్యతో భ‌ర్త త‌ర‌చూ ఫోన్‌లో మాట్లాడుతుండే వాడు. కాగా మార్చి 24 నుంచి రాజ హంస ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌స్తుంది. స్నేహితులు బంధువులు, తెలిసిన వారి వ‌ద్ద ఆరాతీసినా రాజ‌హంస జాడ తెలియక పోవ‌డంతో చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త రాజు.

పనికోసం వెళ్లి తిరిగి రాలే..

Mariyamma

చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీకి చెందిన ఆల‌కుంట ల‌క్ష్మన్‌‌, మ‌రియ‌మ్మ(21)ల‌కు వివాహం జ‌రిగి ఐదేళ్లవుతుంది. వారికి ఒక కూతురు ఉంది. ల‌క్ష్మన్ స్థానికంగా టెంట్ హౌజ్‌ లో ప‌నిచేస్తుండగా, మ‌రియ‌మ్మ ఇళ్లలో ప‌నిచేస్తుంటుంది. రోజులాగే గురువారం ఉద‌యం ప‌నికోసం అని బయటకు వెళ్లిన మ‌రియ‌మ్మ తిరిగి రాలేదు. ఆమెకోసం బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఆరాతీసిన మ‌రియ‌మ్మ జాడ తెలియ‌క పోవ‌డంతో ల‌క్ష్మన్ చందాన‌గ‌ర్ పోలీస్‌ స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు మ‌హిళ‌ల అదృశ్యాల‌కు సంబంధించి వేర్వేరు కేసులు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్సై అహ్మద్ పాషా తెలిపారు.



Next Story