మిస్సైన కరోనా పేషెంట్.. టాయిలెట్‌లో శవమై తేలింది

by  |
మిస్సైన కరోనా పేషెంట్.. టాయిలెట్‌లో శవమై తేలింది
X

ముంబయి: ఎనిమిది రోజుల క్రితం ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన కరోనా పేషెంట్ (80) అదే హాస్పిటల్‌లో శవమై కనిపించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక సీనియర్ ఇన్‌స్పెక్టర్ అక్బర్ పటేల్, ఆస్పత్రి అధికారుల వివరాల ప్రకారం.. భుసావల్‌కు చెందిన ఓ వృద్ధురాలికి గత నెల 27న కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 2నుంచి ఆమె కనిపించకుండా పోయింది. సదరు వృద్ధురాలు కరోనా పేషెంట్ కావడంతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సీసీ కెమరాల ఫుటేజీని పరిశీలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోని ఓ టాయిలెట్ నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా, సదరు వృద్ధురాలు మృతిచెంది కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనీ, దీనిపై విచారణకు ఆదేశించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మృతురాలి మనుమడు వీడియో సందేశం ద్వారా కోరాడు. కాగా, గత మూడు రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 7న (ఆదివారం) కాందివల్లిలోని అంబేద్కర్ శతాబ్ది ఆస్పత్రి నుంచి కూడా 80 ఏండ్ల కరోనా పేషెంట్ కనిపించకుండా పోయాడు. గాలింపు చర్యలు చేపట్టగా ఈ నెల 9న (మంగళవారం) బోరివలీ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మృతిచెందినట్టు పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed