మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకోవాలి..

by  |
మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకోవాలి..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మిస్సింగ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత విజయ శాంతి అన్నారు. దాదాపు 200 మంది అదృశ్య మైనట్లు పోలీస్ శాఖ వెల్లడించిందని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసులపై గురువారం ఆమె తన ఫేస్‌బుక్ ద్వారా వీడియో సందేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికున్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం సుమారు 200 మంది కనిపించకుండా పోయినట్టు పోలీస్ శాఖ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిందని మీడియా తెలిపింది. అయితే, ఒకే రోజున ఏకంగా 65 మంది వరకూ మిస్ అయినట్టు రికార్డవడం మరీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ సమాజంలో కలవరానికి దారి తీయకముందే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి.

ఈ మిస్సింగ్ కేసుల్లో కొద్ది శాతం వ్యక్తిగత, కుటుంబ సంబంధ కారణాలను కలిగి ఉండవచ్చు కానీ, అత్యధిక కేసుల్లో నేరపూరిత కోణాలను కొట్టిపడేయలేం. గతంలో ఎందరో అభాగ్యులు ఇలాగే కనిపించకుండా పోయి సీరియల్ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు, కామాంధుల బారిన పడిన ఘటనలు చూశాం. మాటలతో వివరించలేని రీతిలో పసి మొగ్గల్ని, బాలికల్ని, మహిళల్ని హింసించి బలి తీసుకున్న వ్యధలెన్నో మనం విన్నాం. నెత్తిమీదకు వచ్చినప్పుడు ఏదో ఒక ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఈ సర్కారు విధానంగా మారింది. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకుని, కేసు నమోదైన వెంటనే పోలీస్ శాఖ స్పందించేలా ఒక వ్యవస్థను రూపొందించాలి.’ అని విజయశాంతి అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed