నిధులున్నా.. విధులు సున్నా?

by  |
నిధులున్నా.. విధులు సున్నా?
X

దిశ, రంగారెడ్డి:
పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా అందుకు అనుగుణంగా సమన్వయకర్తలు పనిచేయడం లేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతి మండలంలోని రిసోర్స్​పర్సన్​(విద్యాధికారి) కార్యాలయంలో పనిచేసే మండల ఇన్‌ఫర్మేషన్​ సిస్టమ్​(ఎంఐఎస్) కో‌‌ఆర్డినేటర్ ఎప్పటికప్పుడు విద్యార్థుల వివరాలను అప్‌డేట్​ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంఐఎస్​కో‌‌ ఆర్డినేటర్లు​ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు పాఠశాలల్లోని విద్యార్థుల ఆధార్​కార్డును అప్‌లోడ్​చేయకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలో గల 1,307 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యతోపాటు రోజువారీగా మధ్యాహ్న భోజన వివరాలను వారు విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ భోజన వివరాల ఆధారంగానే ప్రతి నెల బియ్యం సరఫరా అవుతాయి. ఈ వివరాలు సకాలంలో అందకపోతే విద్యార్థులు పస్తులుండాల్సిందే. ప్రతి పాఠశాల​వివరాలను కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా కంప్యూటర్‌లో అప్‌లోడ్​చేస్తుంటారు. ఎంఐఎస్​ కో‌‌‌‌–ఆర్డినేటర్లు లేని మండలాల్లో ఇబ్బందులుంటే ఒప్పుకోవచ్చు. కానీ, కో-ఆర్డినేటర్లు ఉన్న మండలాల్లోనూ వివరాల నమోదు సరిగ్గా జరగడం లేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో 21 మంది కోఆర్డినేటర్లు..

రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలున్నాయి. మండలానికి ఒక ఎంఐఎస్​ కోఆర్డినేటర్​ఉండాలి. కానీ మొత్తం మీద 21 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 6 మండలాలకు ఇన్‌చార్జిలే ఉన్నారు. నూతనంగా ఏర్పడిన ఆరు మండలాలకు కోఆర్డినేటర్లను నియమించడంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రధానంగా బాలాపూర్, అబ్దూల్లాపూర్​ మెట్, కొత్తూర్, నందిగామ, చౌదరిగూడ, కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు కోఆర్డినేటర్లు లేరు. మిగిలిన మండలంలో కోఆర్డినేటర్లున్నా.. మండలంలో వివరాలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ.. వారి వారి వ్యక్తిగత పనులకే ప్రాధాన్యతనిస్తున్నారు.

ప్రతి స్కూల్​నుంచి ఏడాదికి రూ.1500/-

స్కూల్​వివరాలు నమోదు చేసినందుకు మండల కోఆర్డినేటర్‌కు ఏడాదికి ప్రతి స్కూల్ ​నుంచి రూ.1500 చార్జీల రూపంలో అందజేస్తారు. ఆ విధంగా జిల్లాలోని 1307 పాఠశాలలు రూ.1500 చొప్పున సేకరిస్తే మొత్తం రూ.19,60,500 /- జమవుతాయి. సుమారుగా ఒక్కో కోఆర్డినేటర్​ వేతనం రూ.15000లే కాకుండా అదనంగా ఏడాదికి రూ. 60 నుంచి 90 వేల వరకు స్కూల్ గ్రాంట్ల నుంచి టీచర్లు అందజేస్తున్నారు. అయినప్పటికి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

tags : Rangareddy, Mandal Resource Person, MIS Coordinator, Schools, Student records



Next Story

Most Viewed