మీర్జాపూర్ 2 రివ్యూ: పగ తీరిందిగా!

by  |
మీర్జాపూర్ 2 రివ్యూ: పగ తీరిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: దెబ్బతిన్న వ్యక్తి తలుచుకుంటే, ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని అయినా పతనం చేయగలడు. తన పగ తీరేవరకు నిద్రపోడు అని మీర్జాపూర్ సీజన్ 2 మరోసారి నిరూపించింది. అక్టోబర్ 22 రాత్రి ఎనిమిది గంటలకే ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ సీజన్ 2 విడుదలైంది. మొదటి సీజన్‌లో మున్నా, కాళీన్ భయ్యాల కారణంగా తమ వారిని కోల్పోయిన గుడ్డూ, గోలూలు ఈ సీజన్‌లో వారి పగను ఎలా తీర్చుకున్నారో చూపించారు. మొత్తం పది ఎపిసోడ్‌లలో ఎన్నో రాజకీయ కోణాలు, కాళీన్ భయ్యా సామ్రాజ్యం ఒక్కొక్కటిగా పతనమవడం, అన్నింటికన్నా ముఖ్యంగా బీనాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందా లేదా అని అద్భుతంగా చూపించారు.

గుడ్డూ, గోలూ కలిసి తమ పగను మర్చిపోకుండా ఒక్కొక్క పావును కదుపుతూ కాళీన్ భయ్యా, మున్నాలను అంతం చేయాలనుకునే క్రమంలో, బీనా వారికి సహాయపడుతుంది. ఇక్కడ గుడ్డూ, గోలూల అప్రోచ్‌ను గతంలో చాలా సినిమాల్లో, సీరియళ్లలో చూసినట్లుగా అనిపించినా, బీనా పాత్రను నడిపించిన వైనం మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఇద్దరు మగ వాళ్లు మాట్లాడుకునేటపుడు మహిళను కనీసం మాట్లాడనివ్వని ఇంట్లో గుట్టుగా ఉంటూ, మొత్తం మీర్జాపూర్ సింహాసనాన్ని తన కొడుకు కోసం పొందాలని బీనా చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాలి. భర్తకు పిల్లలు పుట్టరని రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్‌ను చంపించడం, తన గర్భానికి కారణం భావుజీ అని, రాజా అని ఎవరికి వారికే సమాధానం చెప్పడం, మున్నా చేతి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి వేసిన ప్లాన్..ఇలా తన వంతుగా గుడ్డూ, గోలూల పగకు సహాయం చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. బీనా, భావుజీని చంపడం. కుర్చీకే పరిమితమై ఉండి కూడా తనతోపాటు పనిమనిషి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్న ఆ 70 ఏండ్ల కురువృద్ధుడిని మాంసం కోసే కత్తితో వీపున నరికి చంపడం ఈ సీజన్‌కే హైలైట్ అని చెప్పాలి. గుడ్డూ, గోలూల పగ సంగతి పక్కన పెడితే బీనా పగ తీర్చుకోవడం ప్రేక్షకులకు అత్యంత ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఇక మున్నా, మాధురీ యాదవ్‌ల పెళ్లి, కాళీన్ భయ్యాకు వ్యతిరేకంగా కదిలే రాజకీయ పావులు కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడానికి బాగా సహాయపడ్డాయి. అయితే, ఈ సీజన్‌లో నిరాశ కలిగించిన విషయాలు ఏంటంటే.. బీనాకు పుట్టిన బిడ్డ గురించి, భావుజీ, బీనాకు చేసిన అన్యాయం గురించి కాళీన్ భయ్యాకు తెలియకుండా ముగించడం, ఇక చివర్లో కాళీన్ భయ్యా బతికే ఉన్నట్లుగా చూపించడం. ఇక నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరమే లేదు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసికా దుగ్గల్, దివ్యేందు శర్మ, శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్ ఇలా ఎవరి పాత్రలకు వారు చేయాల్సినదాని కన్నా ఎక్కువే చేశారు. ఇప్పుడు హిందీలో చూసిన వారు సరే కానీ, ఇవాళో రేపో మళ్లీ తెలుగు ఆడియో వస్తుందిగా అప్పుడు చూస్తే ఉంటుంది అసలు మజా!


Next Story

Most Viewed