ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం.. నిందితుడి అరెస్టు!

by  |
ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం.. నిందితుడి అరెస్టు!
X

దిశ, కంటోన్మెంట్ : మాయమాటలతో బాలికను నమ్మించిన ఓ వ్యక్తి మూడ్రోజులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన బాలిక(16) అక్కడే హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. లాక్‌డౌన్ వలన గతేడాది నుంచి ఓల్డ్ బోయిన్ పల్లిలోని తన పెద్దమ్మ ఇందిర వద్ద ఉంటోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన ఇర్ఫాన్(25) సదరు బాలిక ఇంటి సమీపంలో ఉంటూ.. స్థానికంగా ఓ మసిదులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు మూడు నెలల కిందట ఇర్ఫాన్ పరిచయమయ్యాడు. దానిని అదునుగా తీసుకున్న ఇర్ఫాన్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక ఈనెల 3న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుంటూరులోని తమ బంధువుల ఇంటికని వెళ్లింది. ఆ మరుసటి రోజున ఇర్ఫాన్ సైతం గుంటూరుకు వెళ్లాలనుకున్నాడు. బాలిక కనిపించకపోయే సరికి పెద్దమ్మ ఇందిరా ఫిర్యాదు మేరకు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ పుటేజీలను పరిశీలించారు. అందులో ఇర్ఫాన్‌ను కలిసినట్లు కనిపించింది. దీంతో ఈ నెల 4న అతన్ని ఆదుపులోకి తీసుకొని విచారించగా, అతను చేసిన నేరాన్ని అంగీకరించాడు. బాలికను గుంటూరులో ఆదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె బంధువులకు అప్పగించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

ఠాణా ఎదుట ఆందోళన..

దళిత వర్గానికి చెందిన బాలికను ఓ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ప్రార్థనా మందిరంలో అత్యచారం చేశాడంటూ బీజేపీ, ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను నమ్మించి అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారని పలువురు నేతలు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన కరువైందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్మర్ సింగనావర్, బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డిలు హుటాహుటిన ఠాణాకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో వారంతా ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి, బీజేపీ నాయకులు పప్పుపటేల్, రాజు, శేఖర్, సంతోష్ ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed