గ్రేటర్‎లో ఆ మంత్రుల అట్టర్ ప్లాఫ్ షో

by  |
గ్రేటర్‎లో ఆ మంత్రుల అట్టర్ ప్లాఫ్ షో
X

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసలే దుబ్బాకలో ఓటమి పాలై జనంలో పలుచబడగా, గ్రేటర్​ పీఠాన్ని గెలుచుకోకపోతే మరింత ఇజ్జత్ పోతుందని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయగల ధీశాలురను కేవలం ఒక్క డివిజన్ కే పరిమితం చేసింది. ఆ డివిజన్లకు వారే ఇన్ చార్జీలుగా ప్రకటించి, గెలుపు బాధ్యతలను వారి భుజస్కంధాలపై పెట్టింది. ప్రతి రోజూ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితులను సమీక్షించుకున్నారు. అయినా బీజేపీ గాలికి ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. సింగిల్ డివిజన్ ను గెలిపించుకోలేక చతికిల పడ్డారు.

మంత్రి సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న రెండు డివిజన్లు సరూర్ నగర్, రామకృష్ణాపురంలో ఏ ఒక్క దాంట్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారు. ఆమె కాంగ్రెస్​ పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరగానే మంత్రి పదవిని కట్టబెట్టారు. కానీ ప్రజల్లో రెండేండ్లకే ఆమె బలం సన్నగిల్లింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకూ మూసీ రివర్ ఫ్రంట్​ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. బల్దియాలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఆయన నియోజకవర్గంలోని 11 డివిజన్లలో ఏ ఒక్కటీ గెలిపించుకోలేకపోయారు. అన్ని డివిజన్లు బీజేపీ కైవసం చేసుకున్నది. ఆ నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగిన నాయకుడు లేకపోవడం గమనార్హం.

గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సామ రంగారెడ్డి బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లాకు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయన కూడా పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డు షోలు మాత్రమే నిర్వహించారు. పైగా బీజేపీ అభ్యర్థులంతా దాదాపుగా కొత్త ముఖాలే కావడం విశేషం. ఒకరిద్దరు మాత్రమే రాజకీయంగా అనుభవం కలిగిన వారున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ నియోజకవర్గంలోనూ బీజేపీ సగం డివిజన్లను కైవసం చేసుకుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు నియోజకవర్గంలోనూ సగం డివిజన్లు బీజేపీకి వచ్చాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక్క డివిజన్ ను కూడా గెలిపించుకోలేకపోయారు.

ఆరింట ఐదు బీజేపీకి, ఒకటి ఎంఐఎం పార్టీ గెలుచుకున్నాయి. ఆమె మొదటి రోజే ప్రచారం ప్రారంభించే ముందు గణపతి దేవుడి విగ్రహానికి పార్టీ కండువా కప్పారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె పలుసార్లు తమ పార్టీ 100 సీట్లు గెలుస్తుందంటూ గొప్పలు చెప్పారు. ఆఖరికి ఆమె ఇన్ చార్జీగా వ్యవహరించిన గాంధీనగర్ డివిజన్ ను కూడా గెలిపించుకోలేకపోయారు. 11 మంది మంత్రులు ఇన్ చార్జీలుగా వ్యవహరించిన డివిజన్లలో చచ్చీ చెడి ఎలాగూ టీఆర్ఎస్​ పార్టీ గెలిచినట్లయ్యింది. ఆఖరికి మంత్రి ఈటల రాజేందర్ ఇన్ చార్జీగా వ్యవహరించిన డివిజన్లోనూ ఓటమి పాలయ్యారు. ఐతే దుబ్బాకలో ఓటమి పాలైన సందర్భంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి హరీష్ రావు మాత్రం తన పరువును నిలబెట్టుకున్నారు.

మంత్రులకు అప్పగించిన డివిజన్లు
క్ర.సం డివిజన్ మంత్రి గెలుపు/ఓటమి
1. సరూర్ నగర్ జి.జగదీష్ రెడ్డి ఓటమి
2. భరత్ నగర్ టి.హరీష్ రావు గెలుపు
3. మీర్ పేట ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు
4. చిలుకానగర్ సత్యవతి రాథోడ్ గెలుపు
5. గాజులరామారం వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు
6. రంగారెడ్డినగర్ చామకూర మల్లారెడ్డి గెలుపు
7. హైదర్ నగర్ కేటీ రామారావు గెలుపు
8. వెంకటాపురం కొప్పుల ఈశ్వర్ గెలుపు
9. మల్కాజిగిరి ఈటల రాజేందర్ ఓటమి
10. కేపీహెచ్బీ కాలనీ పువ్వాడ అజయ్ గెలుపు
11. అంబర్ పేట సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపు
12. అడిక్ మెట్ వి.శ్రీనివాస్ రెడ్డి ఓటమి
13. ఎర్రగడ్డ గంగుల కమలాకర్ ఓటమి
14. బంజారాహిల్స్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు
15. సనత్ నగర్​ తలసాని శ్రీనివాస్ ఓటమి​
16. వివేకానందనగర్ బి.వినోద్ కుమార్(ప్రణాళిక సంఘం) గెలుపు
17. గాంధీనగర్​ కల్వకుంట్ల కవిత(ఎమ్మెల్సీ) ఓటమి

Next Story