మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

by  |
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:

నా అనుమతి లేకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రోగ్రాం ఎలా నిర్వహిస్తావ్…
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

సీనియర్ ఎమ్మెల్యేను. నాలుగు సార్లు ఫోన్ చేసిన ఎత్తవా.. నా సొంత డబ్బులు పెట్టి ప్రోగ్రాం చేసిన. నీకు చెప్పాల్సిన అవసరం లేదు.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు

ఇది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య జరిగిన వాగ్వాదం. ఇది సాక్షాత్తు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుటే జరిగిన సంవాదం. దీనిని బట్టి తెలుసుకోవచ్చు.. టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు ప్రారంభమైందని. ఇంతకూ ఏం జరిగిందంటే..

మార్చి 1న నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో శివాలయం పున:ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యేలు షకీల్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, దయానంద్ లతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. బోయిన్ పల్లి నుంచి నిజామాబాద్ వరకు వందల కార్లు, వేల బైక్ లతో అట్టహసంగా ర్యాలీ తీశారు. అయితే జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి తనకు సమాచారం ఇవ్వలేదని, కనీసం ప్రోటో కాల్ పాటించలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తాను ఆహ్వానించడానికే నాలుగు సార్లు ఫోన్ చేశానని, కనీసం తన ఫోన్ కూడా ఎత్తలేదని ఎమ్మెల్యే మైనంపల్లి సమాధానం ఇచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేను అయిన తనను పట్టించుకోలుదని ఘాటుగా విమర్శించారు. ఇదంతా కేటీఆర్ ముందే జరగడం గమనార్హం. దీనిని బట్టి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం కొనసాగుతుందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు జిల్లా మంత్రికి మించి ఎమ్మెల్సీ కవితకు ప్రోటో కాల్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏదిఏమైనా టీఆర్ఎస్ పార్టీలోనూ వర్గ పోరు మొదలైందని చెప్పవచ్చు.



Next Story