బండి సంజయ్, రేవంత్‌ రెడ్డిలపై వేముల సంచలన వ్యాఖ్యలు

by  |
బండి సంజయ్, రేవంత్‌ రెడ్డిలపై వేముల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, బాల్కొండ: ‘కేంద్రమే పెన్షన్లు, 2.5 లక్షల ఇండ్లు ఇచ్చిందని అబద్దాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్ అవి నిజమని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. లేని పక్షంలో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సబ్ ‌స్టేషన్‌కు భూమిపూజ చేసి, నిర్మాణ పనులు ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 40 లక్షల మందికి 8 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తోందన్నారు. అందులో కేంద్రం ప్రభుత్వానికి ఇచ్చేది కేవలం రూ. 2 వందల కోట్లని ఎద్దేవా చేశారు. మోడీ ఇచ్చారంటున్న 2.5 లక్షల ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడున్నాయో బండి సంజయ్ చూపించాలని వేముల డిమాండ్ చేశారు. ‘నేను రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ సెక్రటరీతో వస్తా.. నీవు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ సెక్రటరీతో రా.. ఎవరు ఎంత ఇస్తున్నారో బహిరంగంగా చర్చిద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

రేవంత్‌ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు..

కొత్తగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మంత్రి వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైల్లో చిప్పకూడు తిన్న దొంగ రేవంత్ రెడ్డితో.. మా నాయకుడు కేటీఆర్‌కు పోలిక ఏంటని మండిపడ్డారు. డ్రగ్ టెస్టుకు మీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ ఎయిమ్స్‌లో సిద్ధమేనా అంటూ ప్రతి సవాల్ విసిరారు. ‘నీవో దొంగవు.. నీ సవాల్ స్థాయికి మా నాయకుడు దిగజారిపోలే’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి‌లు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు చూపించాలని వేముల డిమాండ్ చేశారు.

Next Story