రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు: మంత్రి వేముల

by  |
రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు: మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్: తూకం పేరుతో రైతులను మోసగించే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర రహదారులు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి ధాన్యం కొనుగోలు, కరోనా కట్టడిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 92 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతులకు రూ. 52 కోట్లను చెల్లించామని చెప్పారు. జిల్లాలో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 మంది డిశ్చార్జి అయ్యారని అన్నారు. ఇందుకు వైద్యశాఖ, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది గొప్పగా కృషి చేశారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు మోసం చేస్తే యంత్రాంగం ఎంత మాత్రం ఊరుకోదని, క్రిమినల్ కేసులు నమోదు చేసి మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ విఠల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత, ఆర్డీఓ వెంకటయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరకులు పంపిణీ

కలెక్టరేట్‌లో అత్యవసర సేవలందిస్తున్న కింది స్థాయి సిబ్బంది, నిజామాబాద్ నగర మీడియా ప్రతినిధులకు కలిపి 2 వేల మందికి రూ. 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మన కథానాయకులు వీరేనని ప్రశంసించారు. కరోనాకు మందు లేదని, సీఎం కేసీఆర్ సూచన మేరకు వచ్చే 7 వరకు లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు.

Tags: Minister Vemula prashanth reddy, Review, crop purchase center



Next Story

Most Viewed