హుజురాబాద్‌లో ఏమైంది..? నిన్న కలిశాడు.. నేడు కనిపించడం లేదు..

by  |
huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ పాలిటిక్స్‌లో సమీకరణాలు కూడా స్పీడ్‌గా మారిపోతున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు కండువాలు మార్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈటల వెన్నంటే ఉంటున్న మరో ముఖ్య నాయకుడు ఈ రోజు తెరమరుగు కావడం హుజురాబాద్‌లో చర్చకు దారి తీసింది. శుక్రవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మికుంట మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ దేశిని స్వప్న, కోటిల ఇంటికి స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లి కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరి కుటుంబానికి, దేశిని కోటి సోదరి కుటుంబానికి మధ్య వియ్యం ఉండడంతో ఆ బంధుత్వం వల్లే మంత్రి వెళ్లారని చెప్తున్నారు. కోటి ఇంటికి వెళ్లిన సమయంలో మీడియాను అనుమతించలేదు. ఫోటోలు, వీడియోలు కూడా తీయకుండా నిలువరించారు. కోటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరునిగా ఉండడంతో పాటు తాము ఆయనకే మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రాంగం చేసి కోటిని టీఆర్‌ఎస్‌లోకి తిరిగి వచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేశారని విశ్వసనీయంగా తెలిసింది.

ఈటలను వదిలేశారా..?

‘నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అంతా కూడా పార్టీలోనే ఉంటున్నారు. నువ్వోక్కడివే ఈటల వెంట ఉండడం సరికాదు.. భవిష్యత్తు కోసమైనా టీఆర్ఎస్‌లో చేరండి’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోటి దంపతుల ముందు ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘ముఖ్యమంత్రి కూడా నీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఒప్పించి మెప్పించాలని ఆదేశించారు. అందుకే నీ ఇంటికి నేనే స్వయంగా వచ్చా’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే తాము ఈటలకు మాట ఇచ్చామని, ఆయన వెంటే ఉంటామని కోటి దంపతులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో సుతి మెత్తగా చెప్పి తప్పించుకున్నారని సమాచారం. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ‘మరోసారి ఆలోచించుకో నా బంధువుగా నీకు చెప్తున్నాను’ అని చెప్పి వెల్లిపోయారని తెలుస్తోంది.

నిన్న… నేడు…

అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేశిని కోటి కుటుంబ సభ్యులను కలిసి వెల్లిపోయిన తరువాత టీఆర్‌ఎస్ పార్టీలో తిరిగి చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోటీ శుక్రవారం సాయంత్రం ఈటల పాదయాత్రలో కనిపించడంతో ఈటలతోనే ఉంటున్నాడన్న నమ్మకం అందరిలో కలిగింది. కానీ అనూహ్యంగా శనివారం ఉదయం కోటి ఈటల పాదయాత్రలో కనిపించడకపోవడం మళ్లీ చర్చకు తెరలేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉన్నప్పటికి కోటి దంపతులు పాదయాత్రలో లేకపోవడం గమనార్హం. రాత్రికి రాత్రి సమీకరణాలు ఏమైనా మారాయా? అన్న అన్నతర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే కోటీ సమీప బంధువు ఒకరు ’దిశ‘తో మాట్లాడుతూ.. ఈటల వెంట ఉండేందుకే మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. కోటి దంపతులు జమ్మికుంటలోనే ఉన్నారని ఆయన వివరించారు.

Next Story