బీజేపీ లీడర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారీ సవాల్.. నిరూపిస్తే అధికారం మీదే..?

by  |
బీజేపీ లీడర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారీ సవాల్.. నిరూపిస్తే అధికారం మీదే..?
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో అయిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరును నిరూపిస్తే మీకే అధికారాన్ని అప్పగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాకుండా, రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం తపిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

లక్షలాది మంది సభ్యత్వాలను కలిగి ఉండి, ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ ప్రపంచమే గర్వించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులను నింపుతున్నాయన్నారు. నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్ సంస్థల బెనిఫిట్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు సన్నద్ధం కావడం, వడ్ల కొనుగోలుకు సహకరించకుండా రాజకీయాలు చేస్తే రైతులు సహించబోరని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రావడం వల్లే మీకు రాజకీయంగా గుర్తింపు దక్కిందన్న విషయాన్ని గుర్తించాలని బీజేపీ నేతలకు సూచించారు. నిజాలు గుర్తించకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed