త్వరలో మహబూబ్‌నగర్ ప్రజలకు పెద్ద శుభవార్త

by  |
త్వరలో మహబూబ్‌నగర్ ప్రజలకు పెద్ద శుభవార్త
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు అతి త్వరలోనే ఒక పెద్ద ఇండస్ట్రీ రాబోతున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా జిల్లా కేంద్రం సమీపంలోని పాలకొండ పెద్ద చెరువు పునరుద్ధరణకు రూ.కోటి 80 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.

అంతేకాక మున్సిపాలిటీ పరిధిలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన మురుగునీటి కాలువ పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గతంలో పాలకొండ చెరువుకు కాలినడకన వెళ్లేందుకు కూడా దారి ఉండేది కాదని, అలాంటిది ప్రస్తుతం కట్ట వెడల్పుగా చేయటంతో కార్లు వెళుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, బైపాస్ రోడ్డు, ఐటీ టవర్, పాలకొండ గుట్టపై తిరుమలనాథ స్వామి ఆలయం ఉన్నాయని, ఐటీ పరిశ్రమ త్వరలో రాబోతోందని తెలిపారు.

అతి త్వరలోనే మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు శుభవార్త చెప్ప బోతున్నామని, ఒక పెద్ద ఇండస్ట్రీ మహబూబ్‌నగర్‌కు రానుందని ఆయన వెల్లడించారు. ఫుడ్ పార్కు కూడా జిల్లాకు రాబోతున్నదని, దీంతో జిల్లాలోని యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అన్నింటినీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని గ్రామాలు, వార్డుల ప్రజలు ఐకమత్యంగా ఉండి అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Next Story