మాది పేదల ప్రభుత్వం.. ఆ కుటుంబాలకు తప్పక న్యాయం చేస్తాం

by  |
మాది పేదల ప్రభుత్వం.. ఆ కుటుంబాలకు తప్పక న్యాయం చేస్తాం
X

దిశ, మంచిర్యాల: అక్రమ మద్యం నియంత్రణ, నిషేధిత గుడుంబా, నాటుసారా తయారీ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు లక్షెట్టిపేట మండల కేంద్రంలో రూ. 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని తోల్లవాగు వద్ద రూ. 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ స్టేషన్‌ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం పేదల కోసం ఏర్పడిందని, జిల్లాలో అక్రమ మద్యంతో పాటు నిషేధిత గుడుంబా, నాటుసారా తయారీపై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించేందుకు ఎక్సైజ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. నిషేధిత మద్యం కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు సమగ్ర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం షాపుల టెండర్లలో గీత కార్మికులు, దళిత, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించామన్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. గీత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు వారి బాగోగులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గీత కార్మికులలో మరణించిన వారికి రూ. 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. కార్యక్రమాలలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నరేందర్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, కౌన్సిలర్లు, గౌడ సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



Next Story