రిజర్వేషన్ల ప్రకారమే మద్యం దుకాణాల కేటాయింపు

by  |
రిజర్వేషన్ల ప్రకారమే మద్యం దుకాణాల కేటాయింపు
X

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్థులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం (363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు మూడుశాతం (131) దుకాణాలు రిజర్వేషన్ ప్రకారం కేటాయించడం జరిగిందని తెలిపారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన గౌడ్, ఎస్సీ, ఎస్టీ, కులాలకు లాటరీ ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలు కేటాయింపు చేసినట్లు తెలిపారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజులు కూడా పెంచలేదని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని వెల్లడించారు. గతంలో ఒకరు ఒక్క షాపుకు మాత్రమే వేలం పాడే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితి లేదని తెలిపారు. రాష్ట్రంలో గుడుంబాను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని, గంజాయి రవాణా చేసే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతనంగా నియమించబడిన 23 మంది ఏఎన్ఎంలకు మంత్రి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతా రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, సీఐ బాలకృష్ణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, డీటీడీఓ చత్రు, ఎస్సీ అభివృద్ధి అధికారి యాదయ్య హాజరయ్యారు.



Next Story

Most Viewed