తెలంగాణ ప్రజల రక్షణ కవచం టీఆర్ఎస్.. మంత్రి సత్యవతి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Satyavathi Rathod
X

దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ అని, పార్టీ పటిష్టతకు కార్యకర్తలందరూ కృషి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయిలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక గాలి వీస్తే, ములుగులో పొరపాటున మరో గాలి వీచినా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగును జిల్లా చేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదం వల్ల ములుగు జిల్లాగా ఏర్పాటు కావడంతో రూ.55 కోట్లతో ఇక్కడ నూతన కలెక్టరేట్ నిర్మాణం కానుందని తెలిపారు.

గతంలో గిరిజనులకు ఏదైనా సమస్య వస్తే తరచూ వరంగల్ కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ములుగులోనే కలెక్టరేట్ ఏర్పాటు కావడం మూలంగా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సమావేశం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి, టీఎస్ఐఐసీ చైర్మన్ బలమల్లు, ఎంపీ కవిత, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, వైస్ చైర్మన్ నాగజ్యోతి, రైతు సమన్వయ సమితి నేత పల్లా బుచ్చయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, తదితర టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story