రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాయి : మంత్రి సబితాఇంద్రారెడ్డి

by  |
Minister Sabitha Indra Reddy
X

దిశ, తాండూరు: దేశంలో గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫాగింగ్ మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించి గ్రామాల రూపురేఖలను టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పడటంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని అన్నారు.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి అన్ని గ్రామాలకు ఫాగింగ్ మిషన్‌లు అందించటం అభినందనీయమన్నారు. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని దోమల నివారణకు కృషి చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతీ వార్డుకు ఫాగింగ్ మిషన్ ఉండేలా చూడాలన్నారు. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అంతేగాకుండా.. వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చెప్పారు.

తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. రానున్న యాసంగిలో కేంద్రం తెలంగాణ ధాన్యం కొనబోము అని ప్రకటించడంతో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలు చేయాలన్నారు. కూరగాయలు, ఇతర లాభసాటి పంటలు పండించేలా చైతన్య పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న తదితరులు ఉన్నారు.


Next Story