బీజేపీ అలా చేయకపోతే తెలంగాణలో వారికి పుట్టగతులు ఉండవు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by  |
sabhita reddy
X

దిశ, జల్‌పల్లి: బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వారు ముందుగా తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు, రైతులు బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలోని ఆకుల మైలారం గ్రామంలో జరిగిన ధర్నాకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె టీఆర్‌ఎస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతుల మీద కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాన్నామన్నారు.

కేంద్రం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి నష్టపోకుండా ఉండాలని సూచించారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉందన్నారు. రైతులకు అండగా ధర్నా చేసిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ రెండవ పంట కొనమని అంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడిక్కడ ప్రశ్నంచి నిలదీయాలన్నారు. తెలంగాణలో రైతన్నకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు 10 వేలు ఇస్తూ, ఏటా 14 వేల కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్రం మరువద్దన్నారు. ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందజేయడం జరిగిందని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టులు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed