ఖ‌మ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన

by  |
ఖ‌మ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన
X

దిశ, ఖ‌మ్మం: లాక్‌డౌన్ సడ‌లింపుతో ఖ‌మ్మం జిల్లాలో నెల‌కొన్న తాజా పరిస్థితుల‌ను తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ శుక్ర‌వారం విస్తృత ప‌ర్య‌ట‌న చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం ప‌ట్ట‌ణంలోని కమాన్ బజార్, కస్బా బజార్‌లోని వివిధ వ్యాపార సముదాయాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల‌ను సంద‌ర్శించి భౌతిక‌దూరం పాటించాల‌ని సూచించారు. షాపుల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాల‌న్నారు. దూరం పాటించకుండా కార్యకలాపాలు జరిపితే వారిపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. అంత‌కుముందు ఖమ్మం నియోజకవర్గంలో వివిధ రకాల వైద్య చికిత్సలు చేయించుకుని.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న 33 మందికి చెక్కుల‌ను అందజేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీల‌న‌

వైరా నియోజకవర్గం తనికెళ్ళ, సింగరాయిపాలెం గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు, రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సింగరాయిపాలెం గ్రామంలోని నర్సరీని సందర్శించారు.

Tags: Minister Puvvada Ajay, visits, Khammam

Next Story