తక్షణ సహాయక చర్యలు చేపట్టండి : మంత్రి

by  |
తక్షణ సహాయక చర్యలు చేపట్టండి : మంత్రి
X

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఎగువన విస్తారంగా వర్షాలు పడటంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావ‌రి ఉధృతి ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకోవ‌డంతో అధికారుల‌తో క‌ల‌సి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఆదివారం సాయంత్రం భ‌ద్రాచ‌లం చేరుకున్న మంత్రి ముందుగా బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతిని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి పరిశీలించారు. అనంత‌రం రామాలయం అవరణంలోని మెట్ల వద్ద వరద నీరు చేరడంతో వారికి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. అనంతరం వరద ఉధృతిని పరిశీలించి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చూడాలని ఆదేశించారు.

గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన కుటుంబాలను భద్రాచలం కేంద్రంలోని నన్నపనేని మోహన్ జడ్పీ పాఠశాలలో వారికి పునరావాసం కల్పించారు. అనంతరం వారిని కలిసి మాట్లాడారు. గోదావరి వరద ఉధృతిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారుల‌కు సూచించారు. ఆదివారం సాయంత్రం భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్ దత్ అధ్య‌క్ష‌త‌న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భ‌ద్రాద్రి జిల్లాకు వ‌ర‌ద‌ల ముప్పు ఎక్కువ‌గా ఉంద‌ని హెచ్చ‌రించారు. శాఖల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. స‌మీక్ష‌లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో గౌతమ్‌, అధికారులు ఉన్నారు.

కిన్నెర‌సాని ప‌రిశీల‌న‌..

అనంత‌రం అక్క‌డి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(మం) రంగాపురం వద్ద కిన్నెరసాని ఉధృతిని మంత్రి అజ‌య్‌కుమార్, కలెక్టర్ ఎంవీ రెడ్డితో కలిసి పరిశీలించారు. వ‌ర‌ద‌ ఉధృతికి సైడ్ వాల్ కొంత కోతకు గురికాగా మంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. అయితే ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి సూచించారు.

Next Story

Most Viewed