రైట్ రైట్ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పెద్దిరెడ్డి  

by  |
APRTC
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధారణ వ్యక్తిలా మారిపోయారు. అందరితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుడి మాదిరిగానే కండక్టర్‌ వద్ద టికెట్ కొనుక్కుని మరీ ప్రయాణం చేశారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య బస్సు సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి నూతన బస్సు సర్వీసులను గురువారం ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో కొత్త బస్సులు ప్రారంభించిన పెద్దిరెడ్డి ఆ తర్వాత అదే బస్సులో ప్రయాణించారు. బస్సులోనే చౌడేపల్లి మండలంలో దిగారు.

అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లి చౌడేపల్లిలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెబాటలో ప్రజలతో మంత్రి మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి మరీ తెలుసుకున్నారు.‘ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన మండలాల్లోని రైతు సంఘాలకు నిధులు మంజూరు చేస్తోందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘానికి రూ.1.50 కోట్ల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి అందజేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పుకొచ్చారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని సైతం అందజేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Next Story