అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి కీలక ఆదేేశాలు

by  |
అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి కీలక ఆదేేశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా కరకట్ట దిగువన, నదిలోపల ఇళ్లలో ఉన్నవాళ్లకు ఎప్పుడైనా ప్రమాదమే. వాళ్లను ఖాళీ చేయించి వేరే చోట పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్​క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రి పేర్ని నాని, కలెక్టరు ఇంతియాజ్​తో వరదల పరిస్థితిపై సమీక్షించారు. పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించాలని కోరారు. వరదల్లో ఇళ్లు ధ్వంసమైన వారికి పక్కా ఇళ్ళను మంజూరు చేయాలన్నారు.

విజయవాడ కొండ ప్రాంతాల్లో పైభాగాన కొత్తగా ఎటువంటి ఇళ్ళు నిర్మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నది మధ్యలో వున్న లంక భూముల్లో పంట నష్టాన్ని పరిశీలించాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో ఆక్వా రైతులు కూడా భారీ వర్షాల వల్ల నష్టపోయారు. మత్స్యశాఖ అధికారులతో ఆక్వా నష్టంపై కూడా అంచనాలు తయారు చేయాలని పెద్దిరెడ్డి సూచించారు. జిల్లాలో భారీవర్షాలకు దెబ్బతిన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని సూచించారు. బుడమేరు వల్ల విజయవాడ ప్రాంతాలు ముంపు బారిన పడకుండా శాశ్వత చర్యలకు డీపీఆర్​సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కృష్ణానదికి ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏళ్ల తర్వాత 1005 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి కిందికి వదిలినట్లు మంత్రి చెప్పారు.

వరదల ప్రభావం జిల్లాలో 34 మండలాల్లో ఉన్నట్లు కలెక్టరు ఇంతియాజ్​మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 18 నదీతీర మండలాల్లో 47,943 మందిపై అధిక వర్షాల ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు. 38 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 3527 కుటుంబాలను తరలించినట్లు తెలిపారు. పునరావాస చర్యల కోసం ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినట్లు కలెక్టరు వివరించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, జేసీ మాధవీలత, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed