500 కోట్లు ఆగిపోతాయనే స్థానిక ఎన్నికలు: బొత్స

by  |
Botsa
X

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 500 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు చాలా అవసరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు జరుగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే బీసీ రిజర్వేషన్లపై కోర్టుకెక్కారని ఆయన విమర్శించారు.

సీఎం జగన్ ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టీబడితే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు. అలాగే బీసీలకు మేలు చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా వర్గాలకు 59.85 శాతం రిజర్వేషన్లును జగన్ అమలు చేస్తున్నారని ఆయన అభినందించారు.

Tags: botsa, botsa satyanarayana, anantapur, ysrcp, tdp, local body elections

Next Story