హరితహారం మొక్కుబడిగా ఉండొద్దు..త్వరలో సీఎం పర్యటన

by  |
హరితహారం మొక్కుబడిగా ఉండొద్దు..త్వరలో సీఎం పర్యటన
X

దిశ, మహబూబ్ నగర్ :
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఏడాది లేదా రెండేళ్లు టైమ్ పెట్టుకుని కంపతార చెట్లు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆకలిదప్పుల తెలంగాణ ఆరేళ్ల వ్యవధి, కేసీఆర్ దూరదృష్టితో అన్నపూర్ణగా మారిందన్నారు. త్వరలోనే జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానునట్లు ఆయన చెప్పారు. ఒకే రోజు 50 లక్షల మందికి పైగా రైతుబంధు డబ్బుల పంపిణీ చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించామని గుర్తుచేశారు. అనివార్య కారణాల వలన ఖాతాలో డబ్బులు పడని వారు సంబంధిత అధికారులను సంప్రదించాలని, జూన్ 16 వరకు పట్టాదారు పాస్ బుక్‌లు వచ్చిన ప్రతి రైతుకూ రైతుబంధు డబ్బులు అందించామన్నారు. హరితహారం కార్యక్రమం ముమ్మరంగా చేపట్టి, ఉపాధిహామీ పనులలో భాగంగా గ్రామాలలో కాల్వల పూడికను యుద్దప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల నుండి నీళ్లొచ్చి చెరువులు నిండేవరకు కాల్వలన్నీ సిద్ధంకావాలన్నారు.

వివిధ ప్రాజెక్టుల నిమిత్తం చేపట్టిన భూసేకరణకు సంబంధించిన రకరకాల సమస్యలన్నీ పరిష్కరించాలని, నిర్వాసితులకు సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూసేకరణ త్వరగా చేయకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార శాఖ పనితీరును కలెక్టర్ ప్రతి నెలా సమీక్షలు చేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో మిషన్ భగీరధ ప్రత్యేక పనుల కోసం రూ.300 కోట్లు విడుదల చేసినా.. పనుల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగునీటి రాకతో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వనపర్తి జిల్లాలో దిగుబడి వచ్చిందని, మున్సిపాలిటీలలో పార్కులు, పారిశుద్ధ్య సమస్యలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. జిల్లాలో టాయిలెట్లను పంద్రాగస్టుకు పూర్తికావాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వనపర్తి జిల్లా అధికారిక వెబ్ సైట్ మంత్రి ఆవిష్కరించారు.

Next Story

Most Viewed