అసలు మీకు సిగ్గు, శరం ఉందా.. బీజేపీ నేతలపై మంత్రి సీరియస్

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ నేతలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర రైతాంగంపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి వరి కొనాలని డిమాండ్ చేస్తున్నారని, ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉందా? అని ఎద్దేవా చేశారు. ఆటోలో కర్రలు, రాడ్లు తీసుకొని పోతారా? అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్య గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా మాట్లాడారా? అని అడిగారు. బీజేపీ నేతలు తెలంగాణ రైతులకు సమస్యగా మారారని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటే వాళ్లకు నచ్చదని వెల్లడించారు. పనీ పాట లేదని, అసలు కొనుగోలు కేంద్రాల దగ్గరికి బీజేపీ నేతలు వెళ్లాల్సిన అవసరం ఏంటని ఆగ్రహించారు.

గతంలో కన్నా ఈసారి ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, బీజేపీ నేతలకు అసలు సిగ్గు, శరం ఉందా? ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు గురించి మాట్లాడమంటే కేంద్ర మంత్రి మాట్లాడరు, యూపీ, పంజాబ్‌‌లో రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ స్పందించరు, కానీ ఇక్కడ రైతుల పేరిట బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులకు మేము చేస్తున్న దాంట్లో బీజేపీ పాత్ర శూన్యమని, ఒక్కరూపాయి సాయం కూడా కేంద్రం నుంచి రావడం లేదని తేల్చి చెప్పారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, రైతుల ధాన్యంపై గుండాల్లా దాడులకు దిగుతున్నారని తెలిపారు. బీజేపీ వ్యాపారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ అని, మీరా రైతుల గురించి మాట్లాడేది అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న పార్టీ బీజేపీ అని, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి యాసంగి వడ్ల కొనుగోలుపై ప్రకటన చేయించాలని సూచించారు. నల్ల చట్టాలపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని, ఇప్పటివరకూ భంగపడ్డది చాలు, ఇక ముందైనా మంచిగా మసలు కోండి అని బీజేపీ నేతలకు సూచించారు.

Next Story

Most Viewed