అది చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

by  |
అది చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ దొంగ దీక్ష చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే తెలంగాణలో వేసే ప్రతీ పంట, మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకురావాలని సవాల్ చేశారు. చేతకాకపోతే ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన వాదనలో తప్పుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ధాన్యం కొంటామనేదాకా బీజేపీ దీక్షలు చేయాలని సూచించారు. ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ థర్డ్ క్లాస్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణి అని, వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. వానాకాలం మొదలవడానికి ముందు నుంచి నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నదని, సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా కేంద్రంలో చలనం లేదని ఆరోపించారు.

హుజూరాబాద్ ఎన్నికల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని.. పదవిచ్చి, బాధ్యతనిచ్చి అందలమెక్కించిన కేసీఆర్ ను బొంద పెడతామన్నప్పుడే ఈటల రాజేందర్ సంస్కారం బయటపడిందని ఆరోపించారు. హుజూరాబాద్ రైతాంగం బీజేపీ చిల్లర చేష్టలు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో 63 లక్షల ఎకరాలలో వరి సాగైందన్నారు. వంద శాతం పంటల నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.


Next Story

Most Viewed