రెండేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు: మంత్రి నిరంజన్ రెడ్డి…

by  |
రెండేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు: మంత్రి నిరంజన్ రెడ్డి…
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ మక్తల్: వచ్చే వాన కాలంలో రైతులు పత్తి, కంది సాగు కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు గొప్ప శాస్త్రవేత్తలని, నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటను సాగు చేయడం రైతులకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదన్నారు. మన దేశంలో 60 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు.

వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టకపోవడం వల్ల పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నట్లు రైతులకు తెలిపారు. పత్తి సాగులో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని, పత్తికి మంచి ధర కూడా ఉందన్నారు. వచ్చే ఏడాది రైతులు పత్తి, కంది సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే రెండేళ్లలో యాసంగి లో వరికి బదులుగా రైతులు పూర్తిస్థాయిలో ఇతర పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచి లాభాలు గడించడానికి వేరుశనగ, సన్ ఫ్లవర్, పెసర, చెరుకు, మినుములు, అలచందలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు వల్ల మంచి లాభాలు ఉంటాయని, స్వయంగా మా పొలంలో పామాయిల్ తోటల పెంపకాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పాటించి రైతులు పంట మార్పిడి వ్యవసాయం చేసి మంచి లాభాలు గడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు దామోదర్ రాజు, షాకిర్ అలీ, విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరిత తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed