ఏడీబీ నుంచి నిధులు ఇవ్వండి.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

by  |
ఏడీబీ నుంచి నిధులు ఇవ్వండి.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ని మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో భేటీ అయిన మంత్రి మేకపాటి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బ్యాక్ లాగ్స్ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకం కింద పలు పరిశ్రమలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం.. ఏడీబీ నుంచి 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. దీని వల్ల రాష్ట్రంపై కొంత భారం తగ్గే అవకాశం ఉందని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ ఇతర అధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed