కలెక్టర్‌తో మంత్రి మల్లారెడ్డి రహస్య భేటీ..

by  |
కలెక్టర్‌తో మంత్రి మల్లారెడ్డి రహస్య భేటీ..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్ శ్వేతా మహంతి రహాస్య భేటీపై భిన్న వాదానలు వినిపిస్తున్నాయి. తన సొంత పనులను చక్క బెట్టేందుకు మంత్రి మల్లారెడ్డి గురువారం జిల్లా కలెక్టరేట్ లో శ్వేతామహాంతిని తన కార్యాలయంలో రహాస్యంగా కలిసినట్లు కొందరు వాదిస్తుండగా, మరికొందరు మాత్రం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై చర్చించినట్లు చెబుతున్నారు. అయితే కలెక్టరేట్ లో అధికార, పాలక వర్గం ఏ చిన్న సమీక్ష నిర్వహించినా.. కార్యక్రమం చేపట్టినా.. పత్రిక ప్రకటనలు విడుదల చేసే పౌర సంబంధాల శాఖ మాత్రం ఇది పర్సనల్ ప్రోగ్రాం అని చెప్పడంతో పైన పేర్కొన్న వాదానలకు బలం చేకూరినట్లైంది. దీనికి తోడు మంత్రి కలెక్టరేట్‌లో ఉండగానే కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

పాపం మంత్రి..

మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతితో జిల్లా మంత్రి మల్లారెడ్డి గురువారం మధ్యాహ్నం ఆమె ఛాంబర్ లో భేటీ ఆయ్యారు. అనంతరం కలెక్టరేట్ లోనే మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గానికి చెందిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లు, ఎంపీపీలు, సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిధులతో ఒక్కరే సమావేశమయ్యారు. మంత్రి ఒకవైపు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మంత్రి సమావేశంలో ఉండగానే , కలెక్టర్ తన చాంబర్ నుండి బయటకు వెళ్లిపోయారు. మంత్రి, కలెక్టర్ ల సమక్షంలో తమ సమస్యలను విన్నవించి, పరిష్కరించుకుందామని కలెక్టరేట్ కు వస్తే.. కలెక్టర్ సమావేశానికి రాకుండానే వెళ్లిపోవడం పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అదేవిధంగా జిల్లా మంత్రి ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించగా, కలెక్టర్ తమకేమీ పట్టనట్లు వ్యవహారించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు ఇటీవల కీసరలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ హాజరైన పల్లె ప్రగతి లో పాల్గొనాలని, కలెక్టర్ ను మంత్రి మల్లారెడ్డి స్వయంగా అహ్వానించినా ఆమె కార్యక్రమంలో పాల్గొనలేదు. అదేవిధంగా పది రోజుల పాటు నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లోనూ మంత్రి, కలెక్టర్ లు వేర్వేరుగా పాల్గొన్నారు. దీంతో మంత్రి, కలెక్టర్ మధ్యన ఏమైనా బేదాభిప్రాయాలున్నాయా..? అస్సలు మంత్రిని కలెక్టర్ లెక్క చేయడం లేదా..? తాజాగా కలెక్టరేట్ లో చోటుచేసుకున్న పరిణామాలు ఇలాంటి అలోచనలకు ఉప్పందిస్తున్నాయి.

సొంత పనులేనా..

మంత్రి మల్లారెడ్డితోపాటు తన కుటుంబ సభ్యులకు చెందిన పలు భూ వివాదాలు, ఇతరాత్ర సమస్యలను క్లీయర్ చేయాలని మంత్రి గురువారం కలెక్టర్ ను కలిసి కోరినట్లు సమచారం. త్వరలోనే కలెక్టర్ శ్వేతా మహంతి విదేశాలకు పై చదువుల కోసం వెళ్లుతున్నారు. ఆ లోపు పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేయాలని మంత్రి, గత కొంత కాలంగా కలెక్టర్ పై ఒత్తిడి తేస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. దీనికి తోడు జవహర్ నగర్, బోడుప్పల్, మేడ్చల్, కీసర, శామీర్ పేటలలో ప్రభుత్వ స్థలాలను ప్రజాపయోగ అవసరాలకు కేటాయించాలని మంత్రి గత కొంతకాలంగా తాజా, మాజీ కలెక్టర్లను కోరుతూ వస్తున్నాడు.

నాటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంత్రి ప్రతిపాదనలు తోసి పుచ్చగా, ఆ పెండింగ్ ప్రతిపాదనలను ప్రస్తుత ఇన్ చార్జీ కలెక్టర్ శ్వేతా మహంతి ని చేయాలని ఒత్తిడి తేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఇన్ చార్జీ కలెక్టర్ ను మాత్రమేనని, వివాదస్పద సమస్యలను పరిష్కరించలేనని కలెక్టర్ అన్నట్లు సమాచారం. అయితే కలెక్టర్ ఉన్నప్పుడే పనులను చక్క బెట్టుకోవాలని మంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story