తొడగొట్టి.. రేవంత్‌కు సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి

by  |
Minister Mallareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘బ్లాక్ మెయిలర్, దుర్మార్గుడు, బ్రోకర్ రేవంత్ రెడ్డి నన్ను విమర్శిస్తాడా.. నేనేమైనా తప్పు చేశానా? తండ్రి, అన్నలాంటి వాడిని, నాపైనే ఆరోపణలు చేస్తాడా? ఎంత ధైర్యం, దమ్ముంటే చూసుకుందాం రా’’ అని మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్ చేశారు. కబ్జాలు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మల్లారెడ్డి మండిపడ్డారు. తాను పాలు అమ్మి ఇంత వాడిని అయ్యానని, స్కూల్స్, కళాశాలలు స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులను చేయడంతో పాటు వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏనాడూ ‘‘బ్రోకర్ దందా.. లంగా దందా’’ చేయలేదని స్పష్టం చేశారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని, అందులో పోరంబోకు, చెరువు శిఖం లేదని, ఎవరి భూమిని కబ్జా చేయలేదన్నారు. పెద్దా.. చిన్నా తేడా లేకుండా మాట్లాడటం మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

సినిమా డైలాగులు కొడితే కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలే అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కండ్లకు కనిపించడం లేదా? కండ్లు లేవా? అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో రేవంత్ నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. తాను అక్రమాలు చేశానని నిరూపిస్తే.. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ ఎంపీ, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో చూసుకుందాం రా, ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుంది అని సవాల్ విసిరారు. ఓడినవారు రాజకీయ సన్యాసం తీసుకుందామన్నారు. మళ్లీ తానే గెలుస్తానని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను తప్పు చేయలేదని, మనస్సున్న మహారాజును అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేవీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed