‘దిశ’ కథనం.. వారిపై కేటీఆర్ సీరియస్

by  |
‘దిశ’ కథనం.. వారిపై కేటీఆర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని వరంగల్​, కరీంనగర్​ జిల్లా సర్కిళ్లలో పనులకు సంబంధించిన ఎంబీలు మాయమైన అంశంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ వ్యవహారంపై దిశ కథనాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ వరంగల్​ ఇరిగేషన్​ సీఈపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉదయమే దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ వ్యవహారంలో మరో విషయం బయటకు వచ్చింది. ఎంబీ రికార్డులే కాకుండా… వీటి కోసం నిర్వహించే మూవ్​మెంట్​ రిజిస్టర్​ కూడా కనిపించడం లేదని తేలింది. అంటే ఉద్ధేశపూర్వకంగా… నిధుల మాయం కోసమే పకడ్భందీ వ్యూహంతో రికార్డులు, రిజిస్టర్​ను మాయం చేసినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

రిపోర్టు ఇవ్వండి

ఇంటిగుట్టు బయటకు రాకుండా ఉంటుందన్న ధీమాతో ఉన్న ఇరిగేషన్ అధికారుల అంచనాలను ‘దిశ’ తలకిందులు చేసింది. వరంగల్ ఎస్సారెస్పీ ఇంజనీర్ల వద్ద ఉండాల్సిన ఎంబీలు మాయం అయిన వ్యవహారం గురించి దిశ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో సంబంధిత అధికారులపై సీరియస్ అయ్యారు. ఎంబీల గల్లంతు గురించి ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్ ఆరా తీసినట్లు ఇరిగేషన్​ శాఖ ఇంజినీర్లు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ అధికారుల్లో కలవరం మొదలైంది.
ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన ఎంబీలు, వాటికి సంబంధించిన పనులు, చెల్లించిన బిల్లుల వివరాలన్నీ నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్​ సూచించినట్లు చెప్పుతున్నారు. దీంతో ఇప్పుడేం చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆ రిజిస్టర్ ఏదీ?

ఇక టెక్నికల్ అధికారుల వద్ద ఉండాల్సిన ఎంబీలు ఎలా మాయం అయ్యాయన్న విషయం అంతుచిక్కకుండా తయారైంది. ఎంబీలు ఎవరి వద్ద ఉన్నాయో తెలిసేందుకు ప్రత్యేకంగా మూవ్​మెంట్ రిజిస్టర్ కూడా నిర్వహణలో ఉంటుంది. ఒక ఏఈ నుంచి డీఈకి ఎంబీ వెళ్లే సమయంలో సదరు అధికారులిద్దరూ సంతకాలు చేసి మూవ్​మెంట్​ ఖరారు చేస్తారు. ఈ రిజిస్టర్​ కూడా ముఖ్యమైనదే. కానీ కార్యాలయంలో ఈ రిజిస్టర్ కూడా దొరకకపోవడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అంతర్గత విచారణ చేపట్టడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కడం లేదు. ఈ విషయంపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు ? ప్రభుత్వం. దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు మంత్రి కేటీఆర్​ కూడా దీనిపై వివరాలు అడుగుతుండటంతో అధికారులు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఎలా మరి..?

ఈ విషయంలో వరంగల్​ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు సంబంధిత కాంట్రాక్టర్లు ఈ విషయంలో రంగంలోకి దిగినట్లు అనుమానిస్తున్నారు. సదరు ప్రజాప్రతినిధులకు చెందిన కాంట్రాక్ట్​ సంస్థలు ఇరిగేషన్​లో కీలకమైన పనులు చేస్తున్నారు. అందుకే ఇంజినీర్లను కాపాడేందుకు కొంత మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే శనివారం ఉదయం నుంచే మంత్రి కేటీఆర్​ నుంచి వరుసగా ఫోన్లు రావడం, వివరాలు అడుగుతుండటంతో… దీనిపై ప్రజాప్రతినిధులు కూడా ఎలా చేయాలనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.


Next Story

Most Viewed