రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన కేటీఆర్

by  |
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాజీపేటలో రైలు కోచ్ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. ఆరేళ్లయినా హామీని నిలబెట్టుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో మేధా సర్వో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండియన్ రైల్వేస్ నుంచి గుర్తింపు పొందడమే కాకుండా రూ.20కోట్లతో మొదలై రూ.21వేల కోట్ల టర్నోవర్‌ను సాధించారన్నారు. ఐదు ఖండాల్లో విస్తరించిన మేధా కంపెనీ వెనుక కృషి, పట్టుదల ఎంతో ఉందన్నారు. ఆదిభట్లలో విమాన పరికరాలు, బోయింగ్ విమానాల విడి పరికరాలు, అపాచి హెలికాప్టర్ విడిభాగాలు తయారవుతున్నాయి. ఐతే ఇప్పటిదాకా రైలు తయారీ కంపెనీ లేదనుకునేవాళ్లం. ఇప్పుడు మేధా కంపెనీతో నెరవేరిందన్నారు. మెట్రో ప్రారంభించేటప్పుడు కొరియాలోని హ్యూండయ్ కంపెనీ నుంచి కోచ్‌లను తెప్పించాల్సి వచ్చింది. కేంద్రం రూ.30వేల కోట్లతో పీపీపీ నమూనాలో రైళ్ల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని, దాన్ని కూడా మేధా అందుకోవాలన్నారు. రూ.1000 కోట్లతో ఏర్పాటు చేయనున్న మేధా కంపెనీతో ప్రత్యక్ష్యంగా 1000 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉపాధి లభించనుందన్నారు.

స్థానికులకు ఉపాధి కల్పించాలంటే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవసరమని మహబూబ్‌నగర్, చేవెళ్ల ఎంపీలిద్దరూ వారి ఎంపీ ల్యాడ్స్ కింద ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రత్యేక పాలసీని తెచ్చామని బస్సులు తయారు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని మేధా కంపెనీని కోరారు. 106ఎకరాల్లో పరిశ్రమను నెలకొల్పుతుండడం సంతోషంగా ఉందని, ఐతే సీఎస్ఆర్ యాక్టివిటీ కింద చేపట్టే కార్యక్రమాలను కొండకల్, వెలివంపు గ్రామాలను దత్తత తీసుకొని చేయాలని సూచించారు. వచ్చే నాలుగేళ్లలో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని మేధా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. 111 జీవోను సడలించి 87 గ్రామాలకు లబ్ది చేకూరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎంపీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పాల్గొన్నారు.

Next Story

Most Viewed