‘బండి’కి దమ్ముంటే.. ఆ ప్రాజెక్టుపై ప్రకటన చేయించాలి : కేటీఆర్

by  |
‘బండి’కి దమ్ముంటే.. ఆ ప్రాజెక్టుపై ప్రకటన చేయించాలి : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రం నుంచి ఐటీఐఆర్‌కు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రచారం కోసం లేఖలు రాయడం మానుకోవాలని, ఐటీఐఆర్ గురించి సంజయ్ రాసిన లేఖ అబద్ధాల జాతర అని దుయ్యబట్టారు. బుధవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఐటీఐఆర్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని సంజయ్ కి సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీపీఆర్ లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, దమ్ముంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేకుంటే దానికి సమానమైన ఇతర హోదా, ప్రాజెక్టును హైదరాబాద్ కు తీసుకురావాలని సూచించారు. ఐటీఐఆర్ ను రద్దు చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగర యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలోనే కాదు, ఐటీఐఆర్ మంజూరైన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశాల్లో కూడా ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న సంగతి కూడా బండి సంజయ్ కు తెలియకపోవడం ఆయన అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు. ఆయా రాష్ర్టాల్లో ఐటీఐఆర్ ప్రారంభం కాకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమా అని ప్రశ్నించారు. వాస్తవాలను దాచిపెట్టి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ‘‘ఉల్టా చోర్ కోత్వల్ కో డాంటే’’ అన్నట్టుగా ఉందన్నారు. ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది బీజేపీ ప్రభుత్వం అని, తెలంగాణలోని ప్రతీ విద్యావంతుడికి ఈ విషయం తెలుసని మంత్రి అన్నారు.


Next Story

Most Viewed