ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణ అనుమతులు

by  |
ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణ అనుమతులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో జూన్ తొలివారంలో టీఎస్ బీ‌పాస్ విధానాన్ని అమలు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 87మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. సుమారు 1100 దరఖాస్తులు వచ్చాయని, సాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యవస్థకు వచ్చిన సమాచారం ఆధారంగా 15రోజుల్లో ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్టు కేటీఆర్ వివరించారు. జూన్‌లో అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీలోనూ పూర్తిస్థాయిలో టీఎస్ బీపాస్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని గ్రేటర్ అధికారులను కోరారు. ఇందులో భాగంగా రానున్ను రెండ్రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టీఎస్ బీపాస్ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు.



Next Story