రైతు వేదికలు టీఎస్ ఫైబర్‌తో కనెక్ట్ చేయాలి: కేటీఆర్

by  |
రైతు వేదికలు టీఎస్ ఫైబర్‌తో కనెక్ట్ చేయాలి: కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: త్వరలో అందుబాటులోకి రానున్న రైతు వేదికలను టీఎస్ ఫైబర్‌తో కనెక్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. సొంత గ్రామాల నుంచి రైతు వేదికల ద్వారా నేరుగా సీఎం, మంత్రి, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా సంక్షోభం బలమైన డిజిటల్ నెట్‌వర్క్ అవసరాన్ని నిరూపించిందని, ప్రస్తుతం కరోనాపై జరుగుతున్న యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఈ- కామర్స్ సేవల అవసరాల నేపథ్యంలో ప్రతి రాష్ట్రం, దేశం బలమైన డిజిటల్ నెట్వర్క్‌లను కలిగి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకొని పనిచేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున బలమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అవసరమని, ఇలాంటివన్నీ టీఎస్ ఫైబర్‌ తీర్చుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో కనెక్ట్ చేసే తీరుగా ఈ ప్రాజెక్టు ఉండబోతున్నారు. టీఎస్ ఫైబర్ ప్రాజెక్టు పరిధిని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే రైట్ టూ వే చట్ట సదుపాయాన్ని కల్పించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పనులన్నింటినీ రానున్న 10నెలల్లో పూర్తిచేసే దిశగా కసరత్తు చేయాలని సూచించారు. ఈ సమీక్ష ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed