కేటీఆర్‌ను కదిలించిన దివ్యాంగ వృద్ధురాలు

by  |
కేటీఆర్‌ను కదిలించిన దివ్యాంగ వృద్ధురాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అయ్యా నాకేం చెయ్యకున్నా సరే.. కానీ బాంచెన్ మానుపురం శాలోల్లను ఆదుకోండి. సిరిసిల్ల శాలోల్లకు మంచిగా చేస్తున్నావని మా అల్లుడు ఊకే యాదిజేస్తాడని ఓ వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌తో అన్న మాటలు ఇవి. దీంతో నల్గొండ జిల్లా చేనేత కార్మికుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్. మానుపురం చేనేత కార్మికులందరినీ ఆదుకుంటామని కేటీఆర్ ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఓ దివ్యాంగ వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ‘‘ ఓ కేటీఆర్ సారూ ఓ కేటీఆర్ సారూ అంటూ గట్టిగా పిలిచింది. ఆ పిలుపు విన్న కేటీఆర్ వృద్ధురాలి వద్దకు వెళ్లాడు. ఏం మామ్మ ఏమైన పెన్షన్ అవసరం ఉందా అని అడిగారు. సారూ నేను వచ్చి రెండు గంటలవుతుంది ఎవరూ లోపలకు రానిస్తలేరు. మీ పుణ్యాన నెలకు మూడు వేల పెన్షన్ వస్తుంది. కానీ సారూ మా అల్లుడు నల్గొండ జిల్లా తిరుమలగిరి పక్కన మానుపురంలో ఉంటున్నాడు. అక్కడ 30 కుటుంబాలు శాలోల్లయి ఉన్నయి. రెండు నెల్లుగా వాళ్లకు పని నడుత్తలేదు, బట్ట ఎవరు కొంటలేరు వాళ్లను ఆదుకోండి సారూ. ఎప్పటికి మా అల్లుడు నిన్ను యాది జేస్తడు. సిరిసిల్ల శాలోల్లకు కేటీఆర్ మంచిగా చేస్తుండే అంటూ బాగా సార్లు చెప్పిండు సారూ. మా అల్లుని ఊరోళ్లకు ఏమైన సాయం చేయండి అంటూ సిరిసిల్ల పట్టణానికి చెందిన పులి విజయమ్మ(60) అనే వృద్ధురాలు మంత్రి కేటీఆర్ ను ఆర్థించింది.

ఆమె మాటలకు ఫిదా అయిన కేటీఆర్ ఇంతసేపు వెయిట్ చేసి నిల్చోని చెప్పుకున్నది నీ సమస్య కాదా వేరే జిల్లా చేనేత కార్మికుల సమస్య గురించా అని కేటీఆర్ చలించిపోయాడు. వెంటనే నల్లొండ జిల్లా కలెక్టర్‌ను లైన్లోకి తీసుకోవాలని పక్కనే ఉన్న పీఎస్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. మానుపురమే కాదు నల్లొండ జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులు, ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా తదితర విషయాలపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు. దివ్యాంగ వృద్ధురాలు అద్దెకు ఉంటున్నాని చెప్పడంతో ఆమెకు తగిన సాయం చేయాలని ఆదేశించడంతో సిరిసిల్ల తహసీల్దార్ అంజన్నఆమె ఇంటికి వెళ్లారు.<

Next Story

Most Viewed