కేటీఆర్ సీఎం.. ఈసారి కూడా ఉత్తదేనా?

by  |
కేటీఆర్ సీఎం.. ఈసారి కూడా ఉత్తదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కేటీఆర్ సీఎం అనే నినాదాన్ని టీఆర్ఎస్ నేతలు మరో మారు నెత్తిన ఎత్తుకున్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా చాలా సార్లు సీఎం కేటీఆర్ అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే వాటన్నింటిని పక్కకు పెడుతూ సీఎంగా కేసీఆరే కొనసాగారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ సీఎం అవుతారా..? ఎప్పటి లాగే హైప్ క్రియేట్ చేస్తున్నారా..? ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా..? వివరాల కోసం ‘దిశ’అందిస్తున్న ఈ ప్రత్యేక కథనాన్ని చదవాల్సిందే..

సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆయన అధ్యక్షతన జరగాలన్నదే తన ఆకాంక్ష అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాట బయట పెట్టారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుకునే వారిలో తాను ముందు ఉన్నానని ఎమ్మెల్యే బాజిరెడ్డి వంత పాడారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని మంత్రి ఎర్రబెల్లి కూడా అంతే ఘాటుగా ప్రశ్నించారు. మొత్తానికి అందరు కలిసి రాష్ట్రంలో మార్పు వస్తుందనే సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే గతంలో కూడా ఇలా చాలా సార్లు ఆయన పేరు తెరపైకి వచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మొదట సారిగా అంశం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు కేటీఆర్ టీఆర్‌ఎస్ ఎన్నికల ఇంఛార్జ్‌గా పనిచేసి బల్దియాలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేశారు. ఇక ఆయన సీఎం కావడం ఖాయమన్నారు. కానీ అలా జరగలేదు.

ఆ తర్వాత ఓ సారి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఈటల లాంటి వారు మరి కొందరు మంత్రులు కూడా కేటీఆర్ సీఎం వాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అప్పుడు కూడా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కేటీఆర్ సీఎం కానున్నారు. ముహుర్తం ఖరారైందంటు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత చూస్తే కథ మాములే… మళ్లీ సీఎంగా కొనసాగారు.

ఇప్పుడు తాజాగా మరో మారు టీఆర్ఎస్ నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీంతో మరోసారి ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఈ సారైనా కేటీఆర్ సీఎం అవుతారా.. లేదా ఎప్పటి లాగానే పరిస్థితి పునరావృతం అవుతుందా అని ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌కు ఎదురు ఉండేది కాదు. ఆయన పేరు చెబితే అటు ప్రతి పక్షాలు, ఇటు స్వపక్షంలోనూ అంతా భయపడేవారు. కానీ దుబ్బాక ఎన్నికల తర్వాత సీన్ మారింది. దుబ్బాకలో ఓటమితో కేసీఆర్‌కు పెద్ద దెబ్బ తగిలింది. గోరుపోటు మీద రోకలి దెబ్బ అన్నట్టు జీహెచ్ఎంసీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచింది. అపజయాల నేపథ్యంలో కేసీఆర్‌పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు కూడా విమర్శల ధాటిని పెంచింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఏ సందు దొరికినా కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ కూడా మాటల దాడిని పెంచింది.

ఇప్పుడున్న ఓటముల నేపథ్యంలో కేసీఆర్ తప్పుకుని కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశాలు తక్కువ. ఒక వేళ అలా చేస్తే ఓటమిల నేపథ్యంలో అపజయాలకు తట్టుకోలేక కొడుకును ముందుకు తెచ్చి కేసీఆర్ అస్త్ర సన్యాసం చేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం పరిస్థితుల్లో బీజేపీ బలపడుతోంది. ఇలాంటి సమయంలో ఏ కొంచెం తప్పటడుగు వేసినా పార్టీకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక వేళ కేటీఆర్‌ను సీఎం చేస్తే ఆ విషయం జీర్ణించుకోలేని వ్యక్తులు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకోక పోవచ్చనేది విశ్లేషకుల వాదన.


Next Story

Most Viewed