రేపు నేను ఎవరినీ కలవను.. నాకోసం రావద్దు : KTR

by  |
రేపు నేను ఎవరినీ కలవను.. నాకోసం రావద్దు : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాల నేపథ్యంలో, సీఎం ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని, అందుబాటులో ఉండబోనని అన్యధా భావించొద్దని శ్రేణులకు, అభిమానులకు సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.

ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా తన బర్త్ డే సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్‌కు వస్తున్నాయని వాటన్నిటిని క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని తెలిపారు.

Next Story