టీఎస్ బీ-పాస్ ను దేశంలో ఆదర్శంగా నిలపాలి.. మంత్రి కేటీఆర్

by  |
టీఎస్ బీ-పాస్ ను దేశంలో ఆదర్శంగా నిలపాలి.. మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో టీఎస్ ఐపాస్ మాదిరిగా దేశంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి టీఎస్ బీ-పాస్ సైతం దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక వ్యవస్థగా మార్చాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రగతి భవన్ లో సోమవారం పురపాలకశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, ఈ దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల పురపాలికలకు ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నమన్నారు. పట్టణ ప్రగతికి అదనంగా టీయూఎఫ్ఐడీసీ సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మునిసిపాలిటీలకు నిధులను అందజేస్తుందని, తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రూపొందించిన టీఎస్ బీ-పాస్ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పురపాలక శాఖ పని చేయాలని అధికారులకు సూచించారు. టీఎస్ బీ-పాస్ వచ్చిన తర్వాత అనుమతుల ప్రక్రియ గతం కంటే సులభం అయిందన్నారు. టీఎస్ బీ-పాస్ ను ప్రజల వద్దకు మరింతగా చేర్చేలా అవసరమైన మార్పులను వెబ్సైట్ లో చేయడం, ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మరింత వేగంగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ కు మరింత ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల పురపాలక శాఖ తరఫున కొనసాగిస్తున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్ ఆర్ డీపీ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ వారంలోనే ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన మరో రెండు కీలకమైన ఫ్లైఓవర్ లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మునిసిపాలిటీలలో మాస్టర్ ప్లాన్ లను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed