నగరంలో కర్ఫ్యూ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు: కేటీఆర్

by  |
నగరంలో కర్ఫ్యూ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేండ్ల క్రిందట ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్‌లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చు చేసి రోజు తప్పించి రోజు నీళ్లు తీసుకొచ్చామన్నారు. తెలంగాణ వస్తే అల్లర్లు ఉంటాయని చెప్పిన వారి నోర్లు మూతబడేలా గత ఆరేండ్ల అభివృద్ధి చేశామన్నారు. ఇక బీజేపీ నాయకుల ప్రసంగాల పై మాట్లాడిన కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు డజన్ మంది కేంద్ర మంత్రులు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, నగరం వరదల్లో ఉంటే ఏ ఒక్కరు రాలేదన్నారు. వచ్చే నాయకులు ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకుండా.. సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన రూ. 1350 కోట్ల నిధులను తీసుకురావాలని మంత్రి సవాల్ విసిరారు. రావడానికి.. పోవడానికి.. ఏముందన్న కేటీఆర్ నగరంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయన్నారు. కానీ, పేదల సాయం కోసం ఏమైనా తీసుకురావాలని కోరారు. వరద బాధితులను ఆదుకోవాలని లేఖ రాస్తే దున్నపోతుల మీద వాన పడ్డట్టే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కానీ, కర్ణాటక, గుజరాత్‌లో వరదలు వస్తే వెంటనే నిధులు విడుదల చేశారని.. మరి తెలంగాణకు నిధులు ఎందుకు విడుదల చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతల హామీలు ఎన్నికలు ముగిసే వారికే అని.. రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచేది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలి కానీ, ఆగం కావొద్దని కేటీఆర్ సూచించారు. ఉప్పల్‌లో ఐటీ కంపెనీలు తెచ్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

చిచ్చుపెడుతున్నారు గమనించండి..

టీఆర్ఎస్ మన పిల్లల భవిష్యత్తు, కొలువల కోసం పాటుపడుతుంటే.. బీజేపీ నేతలు హిందూ, ముస్లీం పంచాయతీపెట్టి కర్ఫ్యూ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తు కావాలో.. బీజేపీ అల్లర్లు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గత ఆరేండ్లుగా నగరవాసులు అన్నదమ్ములుగా ఉన్నారని.. ఏ పంచాయతీ లేకుండా ఉన్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఇటువంటి హైదరాబాద్‌లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు గమనించుకోవాలని కేటీఆర్ చెప్పారు.

వరదలతో నగరవాసులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తుంటే కూడా ఆపేశారని ఆరోపించారు. ఉత్తరాలు రాసి మరి రూ. 10 వేల సాయాన్ని అడ్డుకున్నారన్నారు. కానీ, ఎన్నికల తర్వాత తప్పకుండా సాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపిస్తే బీజేపీ రూ. 25 వేలు ఇస్తామని చెప్పుతున్నారని.. రూ. 10 వేలు ఆపిన బీజేపీ డబ్బులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనొళ్లు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తరా అంటూ కేటీఆర్ చురకలు వేశారు.


Next Story