నిమ్మగడ్డపై కన్నబాబు ఘాటు విమర్శలు

by  |
నిమ్మగడ్డపై కన్నబాబు ఘాటు విమర్శలు
X

దిశ, విశాఖపట్నం: విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారబోతున్న తరుణంలో ఈ ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రేపు పారిశ్రామికవేత్తలతో, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… పరిశ్రమలను కాపాడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ ప్రారంభించి, గత ప్రభుత్వం పరిశ్రమలకు పెట్టిన రూ. 900 కోట్లు పైచిలుకు బకాయిలను సైతం చెల్లించామన్నారు.

నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించాం. విశాఖపట్నం అభివృద్ధిలో ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేస్తున్నాం. ఎన్నికలకు మేం భయపడుతున్నామని మాట్లాడటానికి సిగ్గు ఉందా..? అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా..? అంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. రెండు, మూడు కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, కరోనా ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బిహార్ లో ఎన్నికల తర్వాత కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుందని అని తెలిపారు.

చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎందుకు ఒక్క మున్సిపాల్టీకి గానీ, స్థానిక సంస్థలకు గానీ ఎన్నికలు నిర్వహించలేదు? విశాఖకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? ఒక్క కాకినాడలో మాత్రమే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించారు తప్ప, ఒక ఎన్నిక కూడా ఎందుకు పెట్టించలేకపోయారని కన్నబాబు ప్రశ్నించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రమేష్ కుమార్ ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? ఖాళీగా ఎందుకు ఉన్నారు? ఆయన స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది? చంద్రబాబును ఆరోజు ఎందుకు నిలదీయలేకపోయారు? అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో అర్థమవుతుందని, ప్రభుత్వం భ్రమల్లో లేదు.. నిమ్మగడ్డ రమేష్ కుమారే చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని ఘాటు విమర్శలు చేశారు.



Next Story

Most Viewed