ప్రైవేటు కోసమే బొగ్గు కృత్రిమ కొరత : మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by  |
ప్రైవేటు కోసమే బొగ్గు కృత్రిమ కొరత : మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే రానున్న రోజుల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తున్నదని అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంగళవారం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులను హరించవద్దని కోరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేవన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందన్నారు. గతేడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా చేస్తున్నామని తెలిపారు.

200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు..

తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ కాదన్నారు. విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్‌కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుందని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి బొగ్గు కొరత, విద్యుత్ కోతలు లేవని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రావు, రానివ్వమని పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయాలే..

దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని, దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. దీనిపై దేశాన్ని పాలిస్తున్న నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టా రీతిన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉందని.. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని విమర్శించారు.


Next Story

Most Viewed