ప్రైవేట్ పాఠశాలలపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణ

by  |
Minister Jagadish Reddy
X

దిశ, నల్లగొండ: ప్రైవేట్ విద్య, వైద్యంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చినవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉచితం’ విలువ తెలిసినరోజు తప్పకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మార్పు సాధించగలుగుతారని అన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణ విద్య భవిష్యత్‌లో యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్‌ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కార్పొరేట్ విద్యార్థులతో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడుతున్నారని అన్నారు.

అందుకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న టీచర్లు అందిస్తున్న బోధనే కారణమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవతో ఇప్పటికే ప్రభుత్వ వైద్య రంగం గాడిలో పడిందని, ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినా, ప్రైవేట్ పాఠశాలల్లో చేరినా అందినకాడికి దోచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, రవీంద్ర నాయక్, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed