వారిని తలుచుకొని గర్వపడాలి.. మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: స్వాతంత్ర్య పోరాట సమరంలో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారని, వారి త్యాగమే నేడు మనం పీల్చే స్వేచ్చాయువులు అని మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని గాంధీ పార్కులో ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిని ఎదిరించి తెలుగు రాష్ట్రాల ప్రజలు, నాయకులు అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషించడం మనకు గర్వకారణం అన్నారు. ఈ మహా ఉద్యమంలో అసువులు బాసిన అమరులను ప్రతీ భారతీయుడు తలుచుకొని, వారికి నివాళులు అర్పించాలని తెలిపారు.

వారి ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని సూచించారు. అందరూ దేశభక్తిని పెంచుకోవాలని, తెలంగాణ బిడ్డగా గర్వ పడాలన్నారు. దేశ దాస్య శృంఖలాలు చేధించిన విధంగానే తెలంగాణలో కూడా దశాబ్దాల పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నేడు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ జీడి భిక్షం, జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి జి.కోటేశ్వరావు, సమాచార ప్రసార శాఖ సీనియర్ సహకుడు హబీబ్, కళాకారులు, పాత్రికేయులు, వర్తక సంఘం అధ్యక్షుడు గండూరి శంకర్, కోశాధికారి శ్రీశైలం పాల్గొన్నారు.


Next Story

Most Viewed